తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయ్. మరో నెల రోజుల్లో పాఠశాలలు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలను విడుదల చేసింది విద్యాశాఖ.

 

మరో నెల రోజుల్లో తెలంగాణలో విద్యాసంవత్సం ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యాసంవత్సరానికి సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఒక తరగతి గదిలో 15 మంది విద్యార్థులకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల గ్రౌండ్, క్లాస్‌ రూముల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాల్సిందేనని.. మాస్క్‌లు, శానిటైజర్‌ వాడకాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలని తెలిపింది విద్యాశాఖ.

 

2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని  నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో షిఫ్ట్‌ల పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం రెండు రోజుల సెలవు ఉంటుంది. రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు. ప్రైమరీ సెక్షన్‌ సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు ప్రతీ రోజూ క్లాసులు ఉంటాయి. స్కూళ్లల్లో ఎలాంటి ఆటలకూ అనుమతి లేదు.  

 

ఈ ఏడాది ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ విద్యాశాఖ. ఒక్కో పేపర్‌లో 80 ప్రశ్నలకు 80 మార్కులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఇప్పటికే నిర్వహించిన మూడు సబ్జెక్టులను రద్దు చేసి.. తిరిగి మొత్తం పరీక్షలను ఓఎంఆర్‌ ద్వారా నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఓఎంఆర్‌ విధానంతో పరీక్షలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వడానికి 30 రోజుల సమయం ఉంటుంది. ఫలితాలను కూడా వారం, 10 రోజుల్లోనే ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: