ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలోనూ తన పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులతో ప్రజలు దేశవ్యాప్తంగా వణికిపోతున్నారు. అనేక సమస్యల బారిన పడుతున్నారు. కానీ మన తెలుగు వారి అడ్డా అయిన హైదరాబాద్ జనాల ధైర్యాన్ని మాత్రం కరోనా కదపలేకపోయిందట. లాక్డౌన్ 1 నుంచి లాక్డౌన్ 3 వరకు నగరవాసులు ఎంతో గుండె ధైర్యంతో ఉన్నారట. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడించింది.
లాక్డౌన్ 1 నుంచి లాక్డౌన్ 3 వరకు ఆయా నగరాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? వారి గుండె ధైర్యం ఏంటి అనే విషయంలో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ సర్వే చేసింది. హైదరాబాదీల గుండె నిబ్బరం గట్టిదని వెల్లడించింది. భాగ్యనగరవాసులు ఎంతో మనో నిబ్బరాన్ని ప్రదర్శించి కరోనాను ఎదుర్కొంటున్నారని తేల్చింది. కరోనా వేళ ప్రజల మానసిక స్థితిపై అధ్యయనం చేసిన సదరు సంస్థ ప్రముఖ నగరాల్లో చేసిన స్టడీలో హైదరాబాద్ ప్రజల మనోధైర్యాన్ని అడిగి తెలుసుకుంది. భాగ్యననగరవాసులు 64 శాతం నుంచి 82 శాతం మంది మనోధైర్యాన్ని ప్రదర్శించారని పేర్కొంది. శంలో విపత్కర సమయంలో హైదరాబాదీలు గట్టిగా నిలబడగలరని తేల్చింది. హైదరాబాద్ ప్రజల మనోధైర్యాన్ని ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ప్రశంసించింది. తద్వారా దేశంలో ఇతర నగరాల ప్రజలతో పోలిస్తే హైదరాబాదీలు చాలా వాటిలో బెటర్ అని స్పష్టమైంది.
కాగా, మరో ఆసక్తికరమైన విషయం సైతం వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్లో నేరాలు తగ్గినట్లు తేలింది. సీసీఎస్కు అనుబంధంగా పనిచేసే మహిళా పోలీస్స్టేషన్లో నెలకు 200 గృహహింస కేసులు నమోదు అయ్యేవి అయితే, లాక్డౌన్లో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది.అంతేకాకుండా ఆపదొస్తే అండగా నిలబడటంలోనూ హైదరాబాదీలు ముందుటారనేది ఇటీవల రుజువైంది. ఆకలి వేస్తోందని ఎవరైనా అడిగితే కచ్చితంగా వారికి సహాయం చేస్తారని పలు ఘటనలు రుజువు చేసిన సంగతి తెలిసిందే.