రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించేందుకు వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సుతారం ఇష్టంగా ఉన్నట్లు కన్పించడం లేదు . రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ ఈ సి కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా , రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది . హైకోర్టు ఉత్తర్వుల ను సుప్రీం లో సవాల్ చేయడం ద్వారా తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది .
ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడం పట్ల ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం , ఆర్డినెన్స్ ద్వారా కమిషనర్ పదవి కాలాన్ని కుదించి నూతన కమిషనర్ గా కనగరాజ్ ని నియమించిన విషయం తెల్సిందే . హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఒకవేళ సుప్రీం కోర్టు , నిమ్మగడ్డ ను ఎస్ ఈ సి కమిషనర్ గా తిరిగి నియమించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా , ఎట్టి పరిస్థితుల్లో ఆయన పదవీకాలం లో మాత్రం స్థానిక సంస్థలు నిర్వహించే అవకాశాలు ఎంతమాత్రం కన్పించడం లేదు .
నిమ్మగడ్డ పదవి కాలం మహా అయితే మరో తొమ్మిది నెలలు మాత్రమే ఉన్న విషయం తెల్సిందే . వచ్చే ఏడాది మార్చి తో నిమ్మగడ్డ పదవీకాలం ముగియనుంది . రాష్ట్రం లో ప్రస్తుతం కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో , నిమ్మగడ్డ ఎస్ ఈ సి కమిషనర్ గా పదవీబాధ్యలు చేపట్టినా , అధికార పార్టీ ఆయన సారధ్యం లో ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అంగీకరించే అవకాశాలు లేవు .
దానికి కరోనా వ్యాప్తిని ప్రభుత్వం సాకుగా చూపెట్టే అవకాశముంది . ఇక ఈ ఏడాది గడిచిందంటే చాలు .. మరో మూడు నెలల పదవి కాలమే మిగిలి ఉండడం తో నిమ్మగడ్డ సారధ్యం లో ఎంతమాత్రం స్థానిక సంస్థల ఎన్నికల జరిగే అవకాశాలు ఉండకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .