ఏపీ ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తోన్న వార్ రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఈ వార్లో ఎవరు పైచేయి సాధిస్తారు ? అన్నది చూడాలి. ఈ విషయంలో టీడీపీ ఓవర్ గా ఎంటర్ కావడంతో రాజకీయ రంగు పులుము కుంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నిమ్మగడ్డకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏతా వాతా బీజేపీ కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తోంది. నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వ వార్ ముందు నుంచి దోబూచు లాడుతూ వస్తోంది. ముందుగా నిమ్మగడ్డ సడెన్ గా కరోనా బూచీ చూపి ఎన్నికలను వాయిదా వేశారు.
ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్డినెన్స్ తెచ్చి ఆయన్ను తొలిగించింది. ముందుగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆయనది పైచేయి అనిపించింది. ఆ తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనపై విమర్శలు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో నిమ్మగడ్డకు మద్దతుగా ఏకంగా పదమూడు పిటిషన్లు పడినప్పుడు మళ్లీ నిమ్మగడ్డది డామినేషన్ అయినట్టు కనిపించింది. ఆ తర్వాత హైకోర్టు నిమ్మగడ్డ తొలగింపు తప్పు పట్టింది. ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలో లోపాలను ప్రస్తావించింది.
ఆ తర్వాత ఏపీ ఏడీజీ ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డ తొలగింపు.. కనగరాజ్ నియామకం తప్పు అయితే నిమ్మగడ్డ నియామకం కూడా రాంగ్ అన్న వాదన తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు బంతి సుప్రీంకోర్టులోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ ఏకంగా స్టాండింగ్ కౌన్సెల్ నే మార్చడం కూడా పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఆయనకే అంత ఉంటే.... ఏకంగా 151 సీట్ల మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారికి ఎంత ఉండాలన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నిమ్మగడ్డ గెలిస్తే రేపు ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ రేపటి రోజు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారా ? మళ్లీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ? పెద్ద చర్చే..?
అయితే జగన్ మాత్రం ఈ విషయంలో ఎంతకు వెనక్కు తగ్గడం లేదు. ఒకవేళ నిమ్మగడ్డనే తిరిగి ఎన్నికల అధికారిగా కొనసాగిస్తే ప్రభుత్వం మరో యేడాది పాటు ఎన్నికలను వాయిదా వేసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని కూడా అంటున్నారు. జగన్ కూడా ఈ విషయంలో ఎంతకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టే కనిపిస్తోంది. అందుకే అటు ప్రభుత్వ న్యాయవాదులను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ వాదనలకు రెడీ అవుతున్నాడు.