అవాంఛిత గర్భధారణను నిరోధించడానికి బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు ఉచితంగా కండోమ్లను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు బిహార్కు చెందిన 30 లక్షల మంది వలస కార్మికులు వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్ ముగిసి ఇళ్లకు చేరిపోయారు. ఇక మరికొంతమంది హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్లు పంపిణీ చేస్తున్నామని బిహార్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. బిహార్లో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారైంటైన్ సెంటర్లలో ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్లాక్లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమమని, కరోనా వైరస్తో ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ పరంగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అని అంటున్నారు.
కాగా, బిహార్లో ఈ నెల 15తో క్వారంటైన్ సెంటర్ల సేవలు ముగియనున్నాయి. బిహార్ జనాభా 11.5 కోట్లు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వైరస్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. బీహార్లో మొత్తం కరోనా వైరస్ కేసులు 3,945 కుపైగా పెరిగాయి. రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ బారి నుంచి కనీసం 1,741 మంది కోలుకోగా, 23 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,181 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 78,090 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.