ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం చైనాయేనని.. మొదట్నుంచీ ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేనన్న అగ్రరాజ్యం అధ్యక్షుడి వ్యాఖ్యలతో.. అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ కూడా ఏకీభవించింది. అయితే డబ్ల్యూహెచ్ ఓ తాజా ప్రకటన సంచలనం రేపుతోంది.
కరోనా పాపం చైనాదేనని... వైరస్ సమాచారం ఇవ్వడంలో కావాలనే జాప్యం చేసిందని... అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మొదట్నుంచీ ఆరోపిస్తున్నారు. అంతేకాదు మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందనీ.. అది డ్రాగన్ దేశానికి అనుకూలంగా ప్రవర్తించిందనీ ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయిందని డబ్ల్యూహెచ్ ఓ చైనా ప్రభావం నుంచి బయటపడాలని తీవ్రవ్యాఖ్యలే చేశారు.
ఆయనంతే అదోటైపు.. అంటూ ట్రంప్ చేసిన విమర్శలపై వ్యాఖ్యలు చేసినవారు సైతం ఇప్పుడు చైనా పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడిప్పుడే డ్రాగన్ మాయ నుంచి డబ్ల్యూహెచ్ ఓ బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. కొవిడ్-19 వైరస్ జన్యుపరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసినట్టు.. డబ్ల్యూహెచ్ ఓ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ చైనా గొప్ప, చైనా సత్వరమే స్పందించింది, వేగంగా వివరాలను పంచుకుంది.. అంటూ బాకా ఊదిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులే... అదంతా నిజం కాదని చెప్పినట్టు అసోసియేట్ ప్రెస్ సంచలన విషయాలను బయటపెట్టింది.
కరోనా కల్లోలం మొదలైనప్పటి నుంచీ చైనాపై ఒంటికాలిపై లేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చైనాను ప్రశంసిస్తూనే ఉంది. డ్రాగన్ ప్రభుత్వం వెనువెంటనే వైరస్ జెనెటిక్ మ్యాప్ను పంచుకుందని చెప్పింది. అంతేకాదు, అందుకు జనవరి నెలలో ధన్యవాదాలు కూడా తెలిపింది.
వాస్తవంగా చైనాలోని ప్రయోగశాలలు ఈ పనిని ఎప్పుడో చేశాయి. జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్ చేశాయి. అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ తయారీకి అత్యంత అవసరమైన ఈ వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదని తెలిసింది. సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేసింది.