అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న ఊపిరి ఆడటం లేదు ఉద్యమం సెగ రోజురోజుకు ఉధృతమవుతోంది. .జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆరోరోజు కూడా అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపినా,స్థానిక పోలీసులు అరెస్ట్ చేస్తున్నా, నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు..మాకు ఊపిరి ఆడటం లేదు...రేపు మేమే కావొచ్చు అంటూ నినదిస్తున్నారు. స్వతంత్ర వైద్య దర్యాప్తు బృందం నిర్వహించిన శవ పరీక్షను జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం రెండు రోజుల క్రితం విడుదల చేసింది. మెడపై గట్టిగా అదిమి పెట్టడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయి ఫ్లాయిడ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
పోలీసు అధికారి క్రూరంగా హింసించడం వల్లే జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన కుటుంబం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసు అధికారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అయితే వచ్చే వారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే గత నాలుగు రోజులుగా అమెరికా మొత్తం ఊపిరి ఆడటం లేదు ఉద్యమం విస్తరించింది. రోడ్లపైకి లక్షలాదిగా జనం రావడమే కాకుండా షాపుల్లో చొరబడి లూటీ చేస్తున్నారు. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యాడు. దోపిడీలు చేస్తే కాల్పులు జరుపుతామంటూ చేసిన వ్యాఖ్యలకు నల్లజాతి అమెరికన్లు మరింత భగ్గమున్నారు. ఇది రెచ్చగొట్టే విధానమేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఫేస్బుక్ పోస్టుల విషయంలో ఆ సంస్థ ఎంప్లాయిస్ అంతా అసంతృప్తిగా ఉండటం గమనార్హం. ఇదే విషయాన్ని ఏకంగా సంస్థ సీఈవో జుకర్బర్గ్ ఎదుటే నిరసన వ్యక్తం చేయడం విశేషం. దీంతో కంపెనీ రెగ్యులర్గా నిర్వహించే ఆల్హ్యాండ్స్ సమావేశంలో ట్రంప్ విధానాలపై ఉద్యోగులు నిరసన గళాన్ని వినిపించారు. ట్రంప్ పెట్టే కొన్ని పోస్టులు కంపెనీ విధానాలకు మార్క్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎంప్లాయిస్ ఆరోపించారు. అయితే నిరసనకారుల వ్యాఖ్యలను జుకర్బర్గ్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. రెచ్చగొట్టే కామెంట్స్ విషయంలో చర్యలు తీసుకుంటామని జుకర్బర్గ్ మాకు చాలాసార్లు చెప్పారని, అయితే ఆయన పాటించలేరని తేలిపోయిందని తీమోతీ అవెని అనే సంస్థ ఇంజనీరు ఫేస్బుక్లో పోస్టు పెట్టి రాజీనామా చేయడం విశేషం.