ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కనుగొనే వ్యాక్సిన్ కోసం కోట్లాది మంది ప్రజలు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న పరిశోధనలు, వాటి ఫలితాలపై సాధారణ ప్రజల నుంచి మొదలుకొని విద్యావంతుల వరకు ఉత్కంఠతో తెలుసుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. సాధారణ నొప్పుల కోసం వాడే బ్రూఫిన్ ట్యాబ్లెట్లతో కరోనాకు చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
బ్రూఫిన్ సాధారణ పెయిన్ కిల్లర్. అయితే ఈ మాత్రలు.. శ్వాసకోస ఇబ్బందుల్ని కూడా దూరం చేస్తాయని డాక్టర్లు భావిస్తున్నారు. సాధారణ బ్రూఫిన్ కాకుండా, ప్రత్యేక ఫార్ములాతో తయారు చేసిన బ్రూఫిన్ ట్యాబ్లెట్లను డాక్టర్లు పరీక్షించనున్నారు. కీళ్లనొప్పులకు సాధారణంగా బ్రూఫిన్ ట్యాబ్లెట్ను వాడుతుంటారు. జంతువులపై జరిగిన పరీక్షల వల్ల బ్రూఫిన్ మాత్రలతో శ్వాసకోస ఇబ్బందులు నయం అవుతాయని నిర్ధారించారు. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉండే ఈ మాత్రల వల్ల.. ఖరీదైన వెంటిలేటర్ చికిత్సకు కరోనా రోగులు దూరం కావొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. బ్రిటన్లో కరోనా పేషెంట్లకు కింగ్స్ కాలేజీ డాక్టర్లు ప్రస్తుతం బ్రూఫిన్ మాత్రలను పరీక్షిస్తున్నట్లు ఓ స్టడీ ద్వారా తెలుస్తోంది. మనుషులపై బ్రూఫిన్ పరీక్షలను చేపట్టనున్నట్లు కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ మితుల్ మెహతా తెలిపారు. కరోనా రోగుల చికిత్స కోసం వాస్తవానికి పారాసిటమాల్ లేదా బ్రూఫిన్ వాడాలా అన్న కొంత మీమాంస ఉండేది. మొదట్లో ఎక్కువ శాతం మంది డాక్టర్లు.. పారాసిటమాల్ వాడాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
కరోనా లక్షణాలు ఉంటే పారాసిటమాల్ తీసుకుంటే బెటర్ అని కమిషన్ ఆన్ హ్యూమన్ మెడిసిన్ అభిప్రాయపడింది. ప్లూ లాంటి లక్షణాలను తగ్గించేందుకు రెండు మాత్రలు పనికొస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే అల్సర్ ఉన్న వాళ్లు మాత్రం బ్రూఫిన్ వాడవద్దు అని డాక్టర్లు నిర్ధారించారు. కోవిడ్19 వ్యాధితో బాధపడేవారికి ఈ మాత్రలు ఫలితాలను ఇస్తే వైద్య రంగంలో అదో రికార్డు అవుతుందని అంటున్నారు.