కరోనా సామాన్య ప్రజలకు కష్టాలను పరిచయం చేస్తే, దళారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తూ, అక్రమాలు చేసేవారి జేబులు నింపుతుంది.. సమాజంలో అవినీతి పరులు పెరిగి పోతున్నారనడానికి ఎన్నో సంఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వారే కరువైయ్యారని ప్రజలు ఎన్నో సార్లు ఆవేదన చెందారు.. నరం లేని నాలుకతో ఎన్ని నీతులైన చెప్పవచ్చు ఆచరించడమే చాలా కష్టం.. అందుకే దళారుల విషయంలో అధికారులు జాగ్రత్త అని చెబుతారు కానీ అసలు దళారులను నిర్మూలించాలని ఆలోచించరు..
ఇకపోతే కరోనాకు ముందు దళారులు చేస్తున్న దందా గుట్టుచప్పుడుగా సాగేది.. కానీ ప్రస్తుతం మాత్రం రోడ్డెక్కింది. ఇక దాదాపుగా అన్ని శాఖల్లో దళారులతోనే పనులు వేగవంతం అవుతాయి అన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ముఖ్యంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ దంద చాలా జోరుగా సాగుతుంది ఈ విషయం అధికారులకు కూడా తెలుసు.. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కార్యాలయాల్లోకి ఎవరు పడితే వారు రాకుండా నియంత్రణ అమలుచేస్తున్నారు. ఈ క్రమంలో కేవలం స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు.
ఒకవేళ లోపలకు వెళ్లాలంటే స్లాట్ బుకింగ్ పత్రం, గుర్తింపు కార్డు కచ్చితంగా చూపించాల్సిందే. లేదంటే కార్యాలయం ప్రధాన గేటు వరకే పరిమితం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దళారులు కొందరు నడి రోడ్డుపైనే తమ పనులు చక్కదిద్దుతున్నారట.. ఇదంతా లోపల కొందరు సిబ్బంది అండతో తమ పని కానిస్తున్నారని ప్రచారం. ఇక ఒక్కో పనికి ఒక్కో రేటు కూడా నిర్ణయించారట.. ఈ పరిస్థితి ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, ఉప్పల్, కూకట్పల్లి, అత్తాపూర్, బహుదూర్పురా ఇలా పలు ఆర్టీఏ కార్యాలయాల సమీపంలోని బయట రోడ్లపై రోజూ దళారులు, వాహనదారులతో సందడి నెలకొంటోంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సదరు అధికారులు కార్యాలయాల వెలుపల ఈ తంతు జరుగుతుండటంతో తమకు సంబంధం లేదని పేర్కొంటున్నారట.
ఇక ఈ దందాకు ఒక కోడ్ భాషను కూడా పెట్టుకున్నారట.. ఇక వాహనదారులు లోపలకు వెళ్లి సదరు ఉద్యోగిని కలవగానే, ఆ కోడ్ చూసి వెంటనే పనిచేసి పెడతాడట. వీరితో పని చేయించుకున్న వ్యక్తి దళారితో ముందు మాట్లాడుకున్న మొత్తం చెల్లించాలి. ఇలా వచ్చే డబ్బులను బట్టి లోపల ఉన్న సిబ్బందికి కమీషన్ల రూపంలో కొంత మొత్తం దళారి ముట్టజెప్పుతాడు. ఇకపోతే రవాణాశాఖ అన్ని సేవలను ఆన్లైన్లో అందిస్తున్నా డిజిటల్ సైన్, ఫొటోలు తీసేందుకు కార్యాలయాలకు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది.
ఎల్ఎల్ఆర్ టెస్టు కోసం కూడా కార్యాలయంలో సంప్రదించాలి. వాహనాల యాజమాన్య హక్కులు మార్పిడి లాంటి పనులకు సంప్రదించాలి. ఇదే దళారులకు వరంగా మారింది. మరి ఈ విషయంలో అధికారులు ఒక్కసారి పునరాలోచన చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారట..