ప్రపంచాన్ని అట్టుకిస్తున్న ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అతనికి కరోనా సోకిందని వెల్లడైంది. శవ పరీక్షకు సంబంధించిన రిపోర్టు వైద్యులు విడుదల చేయగా ఈ నివేదిక ఫ్లాయిడ్కు గతంలో కరోనా సోకిందని తేల్చింది. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తరువాత, అతని కుటుంబీకుల అనుమతితో 20 పేజీల రిపోర్టును విడుదల చేశారు. కరోనా వైరస్ ఉన్నా, ఫ్లాయిడ్ లో లక్షణాలేవీ బయటకు కనిపించ లేదని, మరణించిన సమయంలో ఆయన ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ తెలియజేశారు. ఏప్రిల్ 3న ఫ్లాయిడ్కు కరోనా పాజిటివ్గా తేల్చారని వైద్యులు వెల్లడించారు. అయితే చనిపోయే నాటికి అతనికి ఆ లక్షణాలు లేవన్నారు. కానీ ఇంకా ఊపరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని...ఆ కారణంతోనే చనిపోయినట్లు వెల్లడించారు అధికారులు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. దీంతో అమెరికా నల్లజాతి నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలతో శ్వేతసౌధాన్ని కూడా ముట్టడించారు... నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. కాగా, మిన్నియాపాలిస్ అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్ బుధవారం డెరెక్ చౌవిన్ పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలను అప్ గ్రేడ్ చేశారు. ఘటనా స్థలంలో డెరెక్ కు సహకరించారని మరో ముగ్గురు అధికారులపై అభియోగాలు మోపారు. మే 25న శ్వేతజాతి పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు చనిపోవడంతో అగ్రరాజ్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి.