టూరిస్ట్ వీసాల మీద భారత్ వచ్చిన తబ్లిగీ జమాతే విదేశీయులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. టూరిస్ట్ వీసాల మీద భారత్కు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న 960 మంది విదేశీయులను బ్లాక్లిస్ట్లో పెట్టింది. వారు పదేళ్లపాటు భారత్లోకి రాకుండా నిషేధం విధించింది. కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తున్న సమయంలో దిల్లీలో తబ్లిగీ జమాత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. మర్కజ్ మూలలతోనే దేశ వ్యాప్తంగా కరోనా విస్తరించబడింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆధ్యాత్మిక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహించిన తబ్లీగి జమాతేపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ చేపట్టిన కేంద్రం తబ్లిగీ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులపై నిషేధం విధించాలని తాజాగా నిర్ణయించింది. వాస్తవానికి గతంలో తబ్లీగ్ జమాత్ సభ్యులైన 960 మంది విదేశీయుల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వారందర్నీ హోంశాఖ బ్లాక్ లిస్ట్లో ఉంచింది. 1946 నాటి ఫారినర్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల డీజీపీలకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత నివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా భారత్లో కరోనా జోరు కనిపిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది... గడిచిన పక్షం రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లోని వివరాల ప్రకారం.. గడచిన 24 గంటలలో 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కు చేరుకోగా.. మరణించినవారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఒకేరోజు 260 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాబారిన పడి కోలుకుని ఇప్పటి వరకు దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,04,107 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి.