ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి అంతానికి అన్నిదేశాలు పోరాడుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఈ ఉమ్మడి శత్రువును ఎదుర్కొంనేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాయి దేశాలు. ఈ క్రమంలో టీకా తయారీకి ఉమ్మడికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీకా కూటమి(గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్–జీఏవీఐ)కి భారత్ తరఫున 15 మిలియన్ డాలర్ల(రూ. 113.13 కోట్లు)ను విరాళంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిర్వహించిన గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా నిన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో దాదాపు 50 దేశాలకు చెందిన అధినేతలు, మంత్రులు, ఐరాస సంస్థల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ప్రపంచ మానవాళి ఒక స్పష్టమైన ఉమ్మడి శత్రువుతో పోరాడుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ టీకా కూటమి.. ఒక అంతర్జాతీయ సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంఘీభావ ప్రతీక అని అన్నారు. ఇతరులకు సాయం చేయడమంటే మనకు మనం సాయం చేసుకోవడమేనన్న విషయాన్ని ఈ సంస్థ మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారత్ వైద్య సదుపాయాలు ఎక్కువగా లేని అత్యధిక జనాభా ఉన్న దేశమని, అందువల్ల టీకా ప్రాముఖ్యత భారత్కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం దాదాపు 120 దేశాలతో భారత్ తన దగ్గరున్న ఔషధాలను పంచుకుందని ఆయన గుర్తు చేశారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట ప్రారంభించిన పథకాల్లో పిల్లలు, గర్భిణులు అందరికీ టీకా ఇచ్చే ‘మిషన్ ఇంద్రధనుష్’ ఒకటని మోదీ గుర్తు చేశారు. టీకాల తయారీలోనూ భారత్ ముందుందని, ప్రపంచంలోని చిన్నారుల్లో దాదాపు 60శాతం మందికి భారత్లో ఉత్పత్తి అయిన టీకాలే అందడం తమకు ఎంతో గర్వకారణమని మోదీ చెప్పారు.