కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. బస్సులు నడిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిన్న లేఖ రాశారు. ఏపీఎస్ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. లాక్డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు వస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు, స్క్రీనింగ్ చేసి, వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.
ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం బస్సులు తిప్పడానికి అప్పట్లో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయత్నించగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాని విషయం తెలిసిందే. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నా.. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం.
అయితే.. తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలకు మాత్రమే ఏపీ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.