దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మొదట్లో ఈ కేసుల పట్ల కఠినమైన మార్గదర్శకాలు రూపొందించిన కేంద్రం ఇప్పుడు క్రమంగా చేతులెత్తేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు దేశమంతటా రోజూ 10 వేల కేసుల వరకూ వెలుగు చూస్తుంటే.. తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు దారుణంగా ఉన్నాయి. ఇవి కరోనాను కట్టడి చేసేలా లేకపోగా ఇంకాస్త పెరిగేలా చేస్తాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

 

 

కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై వైరస్ సోకినా ఇంట్లోనే ఉంచి చికిత్స చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణ, వారిచ్చే సలహాలతో 17 రోజుల పాటు చికిత్స జరుగుతుందని, మరింత అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కేంద్రం సూచించింది. వైరస్ సోకిన వారికి చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచాలని, ఇదే సమయంలో ఇంట్లోని వారంతా పోషకాహారాన్ని తీసుకోవాలని పేర్కొంది.

 

 

వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ సోకినట్టు నిర్దారణ అయినా ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటూ నూతన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ విషయంలో అత్యవసరమైతే 18005994455 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించ వచ్చని వెల్లడించింది. ఇక ఇంట్లోనే చికిత్స పొందే వారిని ధారాళంగా గాలి వీచే గదిలో ఉంచాలని, ప్రత్యేక బాత్ రూమ్ ను కేటాయించి, ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న వారితో సేవలను అందించవచ్చని వెల్లడించింది.

 

 

అనుమానితులు వైద్యుల సలహా మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకోవచ్చని, వీటి కోసం స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించింది. ఇంట్లో ఎవరికైనా వ్యాధి సోకితే, ఆ ఇంటిలోని చిన్నారులు, వృద్ధులను వీలైతే మరో ప్రాంతానికి పంపాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో ఉంచుకోవాలని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: