టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పం.. అది ఆయన కంచుకోట. వైసీపీ హవాలోనూ చంద్రబాబు కుప్పుం సీటు నిలబెట్టుకున్నారు. దశాబ్దాల తరబడి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే జగన్ ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు రోజూ కొత్త కొత్త వీడియోలు విడుదల చేస్తున్నారు. జగన్ ఏడాది పాలన అరాచకమంటున్నారు చంద్రబాబు. జగన్ జీరో సీఎం అంటూ వీడియోలు రూపొందిస్తున్నారు.
ఇదంతా చూసి ఒళ్లుమండిన వైసీపీ నేతలు.. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు పాలన వద్దంటూ ప్రజలు తిరస్కరించి 23 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధిరాలేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లుకమ్మాయంటున్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. జూమ్ మీటింగ్లు పెట్టి తన పాలన గొప్పగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
ఇక ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అయితే మరోఅడుగు ముందుకేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో చంద్రబాబు చర్చకు సిద్ధమని, ఏడాదిలో చేసిన సంక్షేమ కార్యక్రమాలపై కుప్పం నియోజకవర్గం నుంచే బహిరంగ చర్చ మొదలుపెడదామని చంద్రబాబుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు రాలేకపోతే లోకేష్ను చర్చకు పంపాలన్నారు.
విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్గా చంద్రబాబు పాలన మిగిలిపోయిందన్న శ్రీకాంత్ రెడ్డి రాజధాని పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కొని పంచుకొని వేల కోట్లు దోపిడీ చేశారని గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు.