దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా వైరస్ దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. నగరంలో కరోనా వైరస్ బారిన పడుతున్న కొవిడ్వారియర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో వైద్యసిబ్బంది.. పోలీసులే అధికంగా ఉన్నారు. దహిసర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్కానిస్టేబుల్ గురువారం ఉదయం మరణించాడు. ఆ తర్వాత ఆయన మృతదేహానికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ హెడ్ కానిస్టేబుల్ బోరివ్లిలోని ఎంహెచ్బి కాలనీలో నివసిస్తున్నాడు. అతనికి భార్య 14 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ మరణంతో కరోనాతో మృతి చెందిన ముంబై పోలీసుల సంఖ్య 20కి పెరిగింది. మే 27న ఆ హెడ్ కానిస్టేబుల్ జ్వరం రావడంతో సెలవుపై వెళ్లి చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు వైరల్ జ్వరం ఉందని, మందులు ఇచ్చాడు. ఆ తర్వాత అతను రెండు రోజుల్లో జ్వరం నుండి కోలుకున్నాడు. కానీ మే 30న ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోలేకపోయాడు.
* మేము అతన్ని ఒక ప్రైవేట్ క్లినిక్లో పరీక్షించటానికి ప్రయత్నించాం. కానీ అధికారులు పరీక్షల కోసం ఫారమ్లు అయిపోయాయని, మరుసటి రోజు రావాలని చెప్పారు* అని హెడ్ కానిస్టేబుల్ భార్య చెప్పారు. అయితే.. జూన్ 1న అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని భగవతి ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి కరుణ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన మృతి చెందాడు. కొంతకాలంగా అతను న్యుమోనియాతో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే కరోనా సోకడంతో పరిస్థితి విషమించింది. ముంబై పోలీసులు 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి సెలవుకు అనుమతి ఇచ్చినప్పటికీ తన భర్త విధులకు హాజరయ్యాడని హెడ్ కానిస్టేబుల్ భార్య చెప్పారు. అయితే.. తన భర్తకు సెలవు మంజూరు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆమె ఆరోపించారు. కాగా, ఇప్పటివరకు 1, 499 మంది పోలీస్ సిబ్బంది వైరస్ బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది మరణించారు.