ఏపీ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 161 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 41 మంది కాగా, 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రాష్ట్రంలోని కొత్త హాట్ స్పాట్స్ నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.

 

సచివాలయంలోని ఉద్యోగులకు వైరస్ సోకిందని సమాచారం. ప్లానింగ్, ఆర్టీజీఎస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిని ఉద్యోగ సంఘం నేతలు కూడా ధృవీకరించారు. అలాగే రోజు తాజాగా మరొక అయిదుగురు సచివాలయం ఉద్యోగులకు వైరస్ సోకిందని నిర్థారించగా వారిలో జగన్ యొక్క కారు డ్రైవర్ కూడా ఉండడం గమనార్హం.

 

ఇక ఏపీ సచివాలంయంలో 2, 3 బ్లాకుల్లో ఉన్న ఉద్యోగులందరినీ ఆఫీసుకు రావద్దని చెప్పేశారు. రెండు బ్లాకుల్లో నే కరోనా రిస్క్ ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక సచివాలంయంలోకి 'ఆరోగ్య సేతు యాప్' వాడుతున్న ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ సచివాలయం కరోనా హాట్ స్పాట్‌గా మారడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.

 

కాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో 131 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మొత్తం కేసుల్లో 127 యాక్టివ్ గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 741 మందికి కోరనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరిలో రోజు 16 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 467 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

రాష్ట్రంలో 40 వేల పైచిలుకు పరీక్షలు చేయగా పాజిటివ్ రేటు 1.02 శాతంగా ఉంది. అదే తెలంగాణలో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. మొత్తానికి ఏపీలో కేసుల సంఖ్య 3588కు చేరుకున్నాయి. ఇక ఒక్క రోజులో కరోనా కేసుల సంఖ్య ఏపీ లో 200 దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: