కరణం బలరామ్....టీడీపీ అధినేత చంద్రబాబు సహచరుడు. ఆయనతో పాటు కలిసే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. అయితే మధ్యలో ఒకసారి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్లొచ్చేసిన కరణం టీడీపీలోనే ఎక్కువ కాలం ఉన్నారు. పైగా కమ్మ సామాజికవర్గ నేత కావడంతో కరణం భవిష్యత్లో టీడీపీని వీడటం కష్టమని కార్యకర్తలు భావించారు. కానీ అనూహ్యంగా కరణం జగన్కు జై కొట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచి కరణం...బాబుకు షాక్ ఇస్తూ వైసీపీకి మద్ధతు తెలిపారు. కరణం వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆయన తనయుడు వెంకటేష్ మాత్రం వైసీపీ కండువా కప్పేసుకున్నారు.
అయితే పార్టీ మారిన కరణం...బాబుపై పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ సడన్గా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి, బాబు పాలనపై విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీ చాలా నష్టపోయిందని, ఎన్నికల్లో ఓటమికి టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని బాబుకు సలహా ఇచ్చారు. అలాగే వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శించినా.. ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే కరణం ఇచ్చిన సలహాని బాబు పాటిస్తారా ? అంటే కష్టమే అని చెప్పొచ్చు.
కాకపోతే ఇక్కడొక విషయం గురించి చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక గానీ, కరణం పార్టీ మారేప్పుడు గానీ చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆలోచిస్తే, బాబు వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కువ నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఆ నెగిటివిటీని తిప్పికొట్టడానికి వైసీపీ అధిష్టానం ప్లాన్ లో భాగంగానే బాబు సామాజిక వర్గమైన కమ్మ వర్గానికే చెందిన కరణం ఇప్పుడు మీడియా ముందుకొచ్చి బాబుకు కౌంటర్లు ఇచ్చారని తెలుస్తోంది.