ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు రేపు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లారని అధికారులు ప్రకటించారు. ఇక ఇంటి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతతో ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలన్నీ రద్దుచేసుకున్న కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండిపోయారు. మంగళవారం కేజ్రీవాల్కు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో స్థానికులకే సేవలు అందించాలని ఆదివారం ప్రెస్ మీట్ పెట్టారు కేజ్రీవాల్. సోమవారం నుంచి మినహాయింపుల వివరాలు కూడా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుండటంతో.. ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంగళవారం ఆయన కరోనా టెస్ట్ చేయించుకుంటారని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడంతో.. ఆయన సమావేశాలన్నీ రద్దయ్యాయి.
అటు ఢిల్లీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 28 వేల 936 పాజిటివ్ కేసులు బయటపడగా వీరిలో 812 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తానికి కరోనా వైరస్ ప్రపంచాన్ని తెగ టెన్షన్ పెడుతోంది. పక్కనుండే వారికి ఏమాత్రం దగ్గు, జలుబు, జ్వరం, తుమ్ములు వచ్చినా జనం హడలిపోతున్నారు. ఎక్కడ వారికి కరోనా ఉందో.. తమకు ఎక్కడ సోకుతుందో అని భయపడిపోతున్నారు. ఎప్పుడు కరోనా వైరస్ అంతమైపోతుందో అర్థం కావడం లేదు. వ్యాక్సిన్ ల తయారీలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్ వస్తే తప్ప ఆ మహమ్మారికి పుల్ స్టాప్ పడేలా లేదు.