సొంత ఇంటి కల.. ఇది అందరి కల.. కరోనాకు ముందు ఇలా అనుకునే వారు చాల మంది ఉండేవారు.. కానీ కరోనా వచ్చిన తర్వాత మారిన పరిస్దితుల దృష్ట్యా కల కళ్లల్లోనే దాగిపోయేలా ఉంది. ఎందుకంటే ఇదివరకు మీ ఇంటికి రుణం ఇవ్వడానికి సిద్దమన్న బ్యాంకులు.. ఇప్పుడు మాత్రం సవాలక్ష షరతులు విధిస్తున్నాయట.. అంతే కాదు రుణం తీసుకున్నవారికి కూడా కరోనా సంక్షోభ నేపథ్యంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయట..

 

 

ఇక కొన్ని బ్యాంకులు అయితే మంజూరు చేసిన రుణాన్ని విడుదల చేసేందుకు కొత్త షరతులు విధిస్తున్నట్లు సమాచారం. దీనికంతటికి కారణం కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, ఉద్యోగుల జీతాలకు కంపెనీలు భారీగా కోతలు విధించడం అంటున్నారు.. ఇక ఇంటి కోసం రుణం తీసుకోవాలంటే తాజా వేతన స్లిప్పులు సమర్పించాలని కస్టమర్లను బ్యాంకులు కోరుతున్నాయట. ఇలా ఎందుకంటే గృహ రుణగ్రహీతల ప్రస్తుత ఆర్థిక స్తోమత, భవిష్యత్‌లో వారు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తిరిగి సమీక్షించేందుకే బ్యాంకులు ఈ కొర్రీలు పెడుతున్నాయంటున్నారు.

 

 

ఇప్పటికే తమ ప్రాజెక్టులో ఫ్లాట్స్‌ బుక్‌ చేసుకున్న చాలా మంది కస్టమర్లకు ఇదివరకే మంజూరైన రుణ నిధులనూ కూడా బ్యాంకులు విడుదల చేయడం లేదని ముంబైకి చెందిన ఓ బిల్డర్‌ తెలిపారు. ఇక మరికొన్ని కేసుల్లో అయితే రుణంలో 20 శాతం నిధులను విడుదల చేసిన బ్యాంకులు లాక్‌డౌన్‌ మొదలయ్యాక మిగతా నిధులను నిలిపివేశాయని ఆయన పేర్కొంటున్నారు.

 

 

ఇక ఒక చోటనే ఇలాంటి సమస్యలు లేవు. దాదాపు దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు రియల్టీ వర్గాలంటున్నాయి. కాబట్టి చేతిలో డబ్బులు ఉంటేగాని సొంత ఇంటి కల నెరవేరని పరిస్దితులు ఇప్పుడు కరోనా వల్ల తలెత్తాయి.. ఒకరకంగా మధ్యతరగతి వారిని కరోనా అనేది కోలుకోలేని విధంగా చేస్తుందని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: