కరోనా దెబ్బతో చాలా మంది వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు వెళ్లటం మొదలుపెట్టారు. మిగిలిన వారిలో అనేక మందికి సరైన రేషన్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్మ నిర్భార్ భారత్ స్కీం క్రింద ప్రతి వలస కూలీకీ 5 కిలోల బియ్యం రెండు కిలోల కందిపప్పు అందించ నున్నారు. వలస కార్మికులకు చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వారికి ఇక్కడే రేషన్ అందించనున్నారు. మొదటగా గ్రేటర్ హైదరాబాద్లోని రేషన్దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు అందించి.. ఇక్కడ విజయవంతమైతే అన్ని జిల్లాల్లో అమలుచేయాలని నిర్ణయించారు.
వలస కార్మికులు ఆకలితో అలమటించకూడదని కేంద్ర ప్రభుత్వం వారందరికీ ఉచిత రేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. వారికి రేషన్ కార్డులు ఉన్నా లేకున్నా నెలకు ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం లేదా గోదుమలు, కుటుంబానికి ఒక కిలో పప్పు ఫ్రీగా మరో రెండు నెలల పాటు అందిస్తామన్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది వలస కూలీలకు లబ్ధి పొందుతారని, ఇందుకోసం ఖర్చయ్యే రూ.3500 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కాగా, ‘టీఎస్ మైగ్రేంట్ యాప్' ద్వారా వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. యాప్ ద్వారా వలస కార్మికుల ఆధార్ నంబర్ అప్లోడ్ చేస్తే జాతీయ డేటాతో కనెక్టవుతుంది.
ఇప్పటివరకు నగరంలో దాదాపు 55,127 మందిని యాప్ ద్వారా గుర్తించారు. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారనే తేడా లేకుండా లాక్డౌన్ పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 12 కిలోల బియ్యం అందించింది. ఐతే ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోలు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు అందిస్తున్నది. మూడు దఫాలుగా రేషన్ అందించన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో అమలుచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్.. నగర సీఆర్వో బాల మాయాదేవిని ఆదేశించారు.