ఇసుక సరఫరాలో అవినీతిని అరికట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక డంప్ ల దగ్గర నేతలు ధర్నాకు దిగారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు మేలు కలిగిస్తూ.. ప్రజల నుంచి దోపిడీ చేసేలా ఇసుక విధానం ఉందని మండిపడ్డారు. ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాషాయ పార్టీ కోరింది.
ఏపీలో ఇసుక సమస్యపై కొద్దిరోజులుగా స్వరం పెంచిన బీజేపీ... శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది. ఇసుక మాఫియాకి పాల్పడిన వారిని కూడా జైలుకి పంపినప్పుడే సిఎం జగన్ కి చిత్తశుద్ది ఉన్నట్లుగా భావిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏడాది పాలనలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరులో ఇసుక స్టాక్ పాయిట్ల ను పరిశీలించిన కన్నా.. అక్కడే కొంత సేపు నిరసన తెలిపారు.
ఇసుక సరఫరాలో అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలోని రాజమండ్రి రూరల్ బొమ్మూరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ధర్నా నిర్వహించారు. వైసిపి పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అవినీతికి సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. వైసిపి పాలనలో ఇసుక సరఫరా మాయాబజారు సినిమాను తలపిస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.
ఏపీలో ఇసుక విధానం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మేలు కలిగించేలా ఉందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కడప జిల్లా మైదుకూరు లోని ఇసుక డంప్ వద్ద కాషాయ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం లో ఇసుక కోసం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో వైసిపి ఇసుక అక్రమార్కులను కాపాడుకునేందుకేనని విమర్శించారు.