దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్... మందుల గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు మరో నాలుగు వారాల్లో కరోనా చికిత్సకు మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కరోనా చికిత్స కోసం రెమిడెస్‌విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు ఉపయోగపడతాయని తేల్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీలైన సిప్లా, గ్లెన్‌మార్క్‌లు రెమిడెస్‌విర్, ఫావిపిరావిర్‌పై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ మందులు ఉపయోగించిన 60 – 70 శాతం మంది ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. 
 
మిగిలిన వారిలో కూడా దుష్ఫలితాలు పెద్దగా కనిపించకపోవడం వల్ల లక్షణాలు తక్కువగా కనిపించే వ్యక్తులకు ఫావిపిరావిర్, లక్షణాలు ఎకువగా కనిపించే వ్యక్తులకు రెమిడెస్‌విర్‌ వాడటం వాడటం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌లో దాదాపు 70,000 మందికి ఫావిపిరావిర్‌ను ఉపయోగించడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని తేలింది. రెమిడెస్‌విర్‌పై మొదట 50 మందిపై ప్రయోగాలు జరిగాయని... ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
త్వరలోనే భారత్ లో ఈ రెండు మందులకు పూర్తిస్థాయిలో వినియోగించడానికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని.... ఇంకో నెలలో 2 మందులకు అనుమతులు లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు భారత్‌ అందరి కంటే ముందుగా ప్రయత్నాలు మొదలుపెట్టినా వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. రెండు కంపెనీలు వేరువేరుగా నిర్వహించిన ప్రయోగాల ఫలితాలను బట్టి డ్రగ్‌ కంట్రోలర్‌కు అందించారు. డ్రగ్ కంట్రోలర్ అనుమతులు ఇస్తే కరోనాను నియంత్రించడం సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: