లాక్డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులు ఇన్నాళ్లు వందకు పైగా ఉండగా కొద్దిరోజులుగా రెండు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో శనివారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులను గుర్తించారు. రోజుకొక కొత్త రికార్డుని కొల్లగొట్టుకుంటూ ఈ తెలుగు రాష్ట్రం కరోనా కేసుల విషయంలో దూసుకుపోతోంది.
దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4737కు చేరింది. ఈ క్రమంలోనే 24 గంటల్లో 8 మంది వైరస్ తో మృతిచెందారు. వీటితో తెలంగాణ మొత్తం కేసుల సంఖ్య 4288కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2203 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఆ వైరస్ నుంచి 2352 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 182కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ 179 ఉండడం గమనార్హం.
గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 179, సంగారెడ్డి 24, మేడ్చేల్ 14, రంగారెడ్డి 11, మహబూబ్నగర్ 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్లగొండ, ములుగు, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో రెండేసి కేసులు నమోదు కాగా... సిద్ధిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా కరోనా టెస్టులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోందని ప్రముఖ బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కరోనా టెస్టుల నిర్వహణకు ఐసీఎంఆర్ అమోదించిన 16 ప్రైవేట్ ల్యాబ్ ల్లో టెస్టులు చేసి ఉంటే రోజుకు 15వేలకు పైగా కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉండేదన్నారు ఆమె ఖచ్చితంగా చెప్పారు. ఇలా కనుక జరిగితే కచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పిన ఆమె కేసీఆర్ ప్రభుత్వం మాత్రం టెస్టుల విషయంలో తన మొండి వైఖరిని మానుకోవట్లేదని అన్నారు.
అయితే తెలంగాణలో రోజు కేవలం 500 ల టెస్టులు మాత్రమే చేసి కేసీఆర్ సర్కార్ తక్కువ కేసులు చూపించే ప్రయత్నం చేస్తుందని అరుణ అన్నారు. అందుకే ఇప్పుడు దీని వల్ల దారుణంగా కేసుల సంఖ్య పెరిగి ప్రజలు అల్లడిపోతున్నారు అని ఆమె ఆరోపించారు.