కరోనా వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చైనా జన్మస్థలం అయిన కరోనా.. ప్రపంచదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కంటికి కనిపించని ఈ అతిసూక్ష్మజీవి.. మానవాళికి ఇప్పుడు పెద్ద గండంగా మారింది. ఇప్పటికే లక్షలాదిమందిని బలి తీసుకున్న ఈ ప్రాణాంతకర వైరస్ను నివారంచేందుకు ప్రపంచదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఇక రోజుల తరబడి లాక్డౌన్ను అమలు చేస్తున్నా.. కరోనా వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పూ కనిపించకపోగా.. రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.
అయితే కరోనా సోకితే చనిపోతారనే ప్రచారం బాగా సాగుతోంది. కానీ, అది నిజంకాదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ మహమ్మారిని ఎందరో జయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో నాలుగు నెలల చిన్నారికి వైరస్ సోకడంతో 18 రోజుల పాటు వెంటిలేటర్ పై కరోనాతో పోరాడి.. చివరకు ఈ ప్రాణాంతకర వైరస్ ను జయించి అమ్మ ఒడికి చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ కరోనా వైరస్ సోకింది.
అయితే వైద్యులు అనుమానంతో తన నాలుగు నెలల చిన్నారికి కూడా పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దాంతో చిన్నారికి చికిత్స అందించేందుకు మే 25న విశాఖపట్నంలోని వీఐఎంఎస్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రిలో 18 రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి చిన్నారికి చికిత్స చేశారు. అలా 18 రోజుల పాటు కరోనా మహమ్మారితో సదరు చిన్నారి పోరాటం చేసి.. చివరకు వైరస్ ను జయించింది. ఇక డాక్టర్లు మరోసారి నిర్ధారణ చేసుకునేందుకు ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేయడంతో నెగిటివ్గా వచ్చింది. అన్ని ఆరోగ్య పరీక్షల పూర్తి అనంతరం పాపను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.