భారత్లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,195కి పెరిగింది. 1,49,348 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో వుంది. ఈ క్రమంలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే కరోనా బాధితులతో నిండిపోయాయి.. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి.
అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 వాడుకలో ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. నగరమంతా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్, కోవిడ్ హెల్త్ సెంటర్లలలో 10,450 పడకలు ఉండగా, వీటిలో 9,098 పడకలు నిండిపోయాయి. ఇక మహారాష్ట్రలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర పోలీసుల బలగాల ఆధునీకరణపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రపంచ ప్రమాణాలతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముంబైలో ముఖ్యంగా దక్షిణ ముంబైలోని సముద్రతీర ప్రాంతంలో పెట్రోలింగ్ చేపట్టడం పోలీసులకు కత్తిమీది సాముగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 50 సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లను పోలీసులకు అప్పగించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. త్వరలో బాంద్రా, జుహూ, వెర్సోవా వంటి ప్రాంతాల్లో కూడా చేపట్టాలని నిర్ణయించారు.