సహజంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయంగా నిలదొక్కుకుంటున్నారంటే ఆ కుటుంబం మొత్తం సహకరించడం మనం చూస్తుంటాం. అయితే అందుకు విరుద్ధంగా కురుపాం నియోజకవర్గంలో జరుగుతోంది. మామ శత్రుచర్ల చంద్రశేఖర్రాజు కోడలు డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పశ్రీవాణిల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఇప్పుడు కోల్డ్వార్ కూడా అనలేం. తమకు సన్నిహిత అనుచరగణం వద్ద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శత్రుచర్ల అయితే ఒకడుగు ముందుకేసీ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్న పనులు...అందులో డిప్యూటీ సీఎం వైఫల్యం వంటి అంశాలతో విమర్శల బాణాలను ఎక్కుపెడుతుండటం విశేషం.
కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగానే కోడలు పుప్పశ్రీవాణి నాయకత్వాన్ని మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు అంగీకరించలేక పోతున్నారు. నియోజకవర్గంలో తనకు ఏమాత్రం గౌరవం లేకుండా కోడలు, కుమారుడు చేస్తున్నారని ఆక్రోశంతో చంద్రశేఖర్ రాజు ఉన్నారు. అందుకే నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని, ప్రభుత్వపాలన సక్రమంగా లేదని విమర్శలు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పుష్ప శ్రీవాణికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కోడలు ఎదుగుదల చూసి ఏ మామ అయినా ఆనందిస్తారు. కుటుంబం పరువు ప్రతిష్టలకు అండగా నిలుస్తారు. కానీ కురుపాం నియోజకవర్గంలో మాత్రం మామ కోడలు ఉన్నతిని సహించలేక పోతున్నారన్న విమర్శలు శత్రుచర్లపై శ్రీవాణి వర్గం నేతలు వినిపిస్తున్నారు.
వాస్తవానికి గత ఏడాది కాలంగా తనను పక్కన పెట్టి అంతా కొడుకు,కోడలు నియోజకవర్గాన్ని చూసుకుంటడంతో ఆయన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు సహించలేకపోతున్నారు. కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబానికి మంచి పట్టుంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఎస్టీ లు కాదన్న న్యాయస్థానం తీర్పుతో ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్ప శ్రీవాణిని కోడలిగా తెచ్చుకున్నారు. దీంతో ఆయన 2014లో గెలిచిన ఆమె, 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. గెలిచిన తర్వాత పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం కావడం గమనార్హం. అయితే కొద్దికాలంగా ఆయన భిన్నస్వరం వినిపిస్తూ సొంత కుంపటి రాజేస్తుండటం విశేషం.