మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టులతో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఇక తరువాత ఎవరన్నది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా మొదలైంది. ఇప్పటికే ఫైబర్ నెట్, చంద్రన్న కానుకల పై సీబీఐ విచారణకు జగన్ సర్కారు సిఫార్సు చేయడంతో సీన్ ఇంకాస్త ముదిరిపోయింది. అయితే ఇక తరువాత అరెస్టు నారా లోకేశ్ దేనా అన్న అనుమానం వైసీపీ నేతల మాటల ద్వారా కలుగుతోంది.
ఎందుకంటే.. తాజాగా నారా లోకేశ్ అనంతపురం జిల్లాకు వెళ్లి అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ జగన్ సర్కారుపై రంకెలు వేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా అదే రేంజ్ లో బదులిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతీ స్కీమును.. స్కాములుగా మార్చేసిందని, చేసిన అవినీతి అంతా ఇప్పుడు బయటపెడుతుంటే చంద్రబాబు, లోకేష్ వెన్నులో వణుకుపుడుతోందని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
లోకేష్నాయుడు చిప్పకూడు.. చిప్పకూడు అని కలవరిస్తున్నాడని, పైన తధాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ చురకంటించారు. కామన్సెన్స్ లేకపోతే స్టాంఫర్డ్లో చదివినా.. వీధి బడిలో చదివినా ఒక్కటేనన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్. అంబేడ్కర్ రాజ్యాంగం స్పష్టంగా అమలు చేస్తున్నాం కాబట్టే చంద్రబాబు, లోకేష్, మిగతా అవినీతిపరుల అందరి వెన్నులో వణుకుపుడుతోందన్నారు.
అంతే కాదు.. ఫైబర్గ్రిడ్లో లోకేష్ను అరెస్టు చేస్తారని ఎవరూ చెప్పకుండానే.. తన నెంబర్ నెక్ట్ అని అతనే అనుకుంటున్నాడని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. చేసిన అక్రమాలు కూడా బయటకు వస్తాయని, ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదని హెచ్చరించారు. మరి అనిల్ మాటలను బట్టి చూస్తే వైసీపీ నెక్స్ట్ టార్గెట్ లోకేశేనా..?