కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కంటికి కనిపించని ఈ కరోనా భూతం.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల సంభవిస్తున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా కలిగే లక్షణాలు సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉన్నా, కొద్ది వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారడం ఈ వైరస్ నైజం. అయితే రోజుల తరబడి లాక్డౌన్ను అమలు చేస్తున్నా.. కరోనా ఉధృతి ఎక్కడా తగ్గట్లేదు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటేసింది. మరియు కరోనా సోకి 4.38 లక్షలకు పైగా మృత్యువాత పడ్డారు. అయితే ఇలాంటి సమయంలో కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయపడడంతో.. ప్రజల్లో మరింత ఆందోళన పెరిగిపోతోంది. సాధారణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారపర్యంగా మాత్రమే డయాబెటిస్ వస్తుందని తెలుసు. తాజాగా కరోనా వైరస్ వల్ల కూడా కొత్తగా మధుమేహం వస్తుందని పరిశోధనలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న వారిని అదృష్టవంతులుగా భావిస్తున్న ఈ తరుణంలో, అంతర్జాతీయ డయాబెటిస్ నిపుణుల బృందం షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
క్లారిటీగా చెప్పాలంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న వేల.. అంతర్జాతీయ డయాబెటిస్ నిపుణుల బృందం కరోనా బాధితులపై పరిశోధన చేపట్టారు. వారిలో శరీరంలో చక్కెర స్థాయిని విశ్లేషించారు. ఈ క్రమంలోనే బాధితులపై వైరస్ రెండు విధాలుగా ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఒకవైపు మధుమేహం ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ మరింత ప్రమాదకారి. మరోవైపు వైరస్ సోకిన వ్యక్తులకు కొత్తగా మధుమేహం కలిగిస్తుందని తేలింది. అంతేకాదు కరోనా మరణాల్లో మధుమేహ రోగుల శాతం 20 నుంచి 30 వరకు ఉందని తెలింది.