దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతిరోజూ వందల కొద్దీ కేసులు నమోదవుతుండడంతో నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వారు టెన్షన్తో సమయం గడుపుతున్న పరిస్థితి ఎదురవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలోని కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఈ నెల 3వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా కేసులు 3 వేలు దాటాయి. 10వ తేదీన ఆ సంఖ్య 4 వేలకు చేరుకుంది. అయితే ఈ సంఖ్య 15వ తేదీకి భారీగా పెరిగింది. ఐదు రోజుల్లోనే మొత్తం వెయ్యి కేసులు నమోదయి ఐదువేలకు చేరింది. మూడు నుంచి నాలుగు వేల కరోనా కేసులు నమోదు కావడానికి 7 రోజులు పట్టగా.. నాలుగు నుంచి ఐదు వేలకు చేరుకోవడానికి కేవలం 5 రోజులే పట్టింది. దీంతో ప్రజల్లో ఆందోలన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో అతి తక్కువ సమయంలో వేలల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ కేసుల పరంపరతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలాఉండగా, తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. తనను కలిసేందుకు మిత్రులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా రాకుండా.. ఫోన్లో కానీ, వాట్సాప్లో కానీ సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరం మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ.. మనల్ని మనం కాపాడుకుందామని ఈటల రాజేందర్ పిలుపు ఇచ్చారు.