భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. కల్నల్తో మరో ముగ్గురు జవాన్లు హతమయ్యారు. చైనా బలగాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. సుమారు 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని.. ఆ త్యాగం వెలకట్టలేనిదని కేసీఆర్ అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశం కోసం అమరుడైన సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన హవల్దార్ పళని కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసహాయం ప్రకటించింది. చైనా సైనికులు పరస్పరం దాడులు చేసుకోవడంతో తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన హవల్దార్ పళని మరణించారు. హవల్దార్ పళని మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి తీవ్ర సంతాపం ప్రకటించారు.
అమరుని కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షలు అందిస్తామని, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. హవల్దార్ పళని 22 ఏండ్లపాటు పళని వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న అతని భార్య రామనాథపురం జిల్లాలోని ఓ డిగ్రీ కళాశాలలో క్లర్క్గా పనిచేస్తున్నారు.