లాక్ డౌన్ విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న చర్చకు తెరపడింది. దేశంలో లాక్డౌన్ల దశ ముగిసిందని, ఇక అన్లాక్ల దశ ప్రారంభమైందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. మళ్లీ లాక్డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పెద్ద టెన్షన్కు తెరపడింది. ప్రస్తుతం అన్లాక్ 1.0 నడుస్తున్నదని, అన్లాక్ 2.0 ఎలా అమలుచేయాలనే విషయమై చర్చించుకోవాల్సి ఉన్నదని చెప్పారు. వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రస్తావించిన అంశం ఆధారంగా ఈ క్లారిటీ వచ్చేసింది. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరగా ఈ మేరకు మోదీ క్లారిటీ ఇచ్చారు.
కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ...తెలగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని ప్రధానికి వివరించారు. ‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నది. ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాలరేటు తక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరులో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది.` అని తెలిపారు. దీంతో పాటుగా ‘ప్రధాని మీడియాతో మాట్లాడుతున్నారు అనగానే లాక్డౌన్ ప్రకటన చేస్తారు అని అనుకుంటున్నారు. ప్రధాని అందరు సీఎంలతో మాట్లాడకుండా లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరని నేను చెప్తున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’ అని సీఎం కేసీఆర్ కోరారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు. 4 దశల లాక్డౌన్ ముగిసింది. అన్లాక్ 1.0 నడుస్తున్నది. అన్లాక్ 2.0 అమలుపై మనం చర్చించుకోవాలి’ అని అన్నారు.
ఇక తెలంగాణలోని కరోనా కేసుల గురించి ప్రస్తావిస్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ``ఇక్కడ కూడా కొద్ది రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందనే నమ్మకం నాకున్నది. మళ్లీ మా మూలు జీవితం ప్రారంభం అవుతుంది. కూలీలు, కార్మికులు, హమాలీలు పని చేసుకోవడానికి వివిధ రాష్ర్టాలకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. వారికి అవకాశమివ్వాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకునే అవకాశముండాలి.` అని కీలక ప్రతిపాదన చేశారు.