దేశమంతా కరోనా కష్టాలతో ఇబ్బంది పడుతోంది. రాష్ట్రాలది కూడా అదే పరిస్థితి. ఆదాయం బాగా తగ్గిపోయిది. ఖర్చులు పెరిగాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు. 'వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలుకు నడుంబిగించాడు. వాస్తవానికి గత డిసెంబర్లోనే ఈ పథకం అమలు చేశారు. అర్హులైన నేతన్నల ఖాతాల్లో రూ. 24 వేలు జమ చేశారు.
లెక్క ప్రకారం.. మళ్లీ డిసెంబర్ కే నేతన్న హస్తం అమలు చేయాలి. కానీ కరోనా కారణంగా నేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ఆరు నెలల ముందుగానే ఈ నేతన్న హస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా చేనేతల కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చే కార్యక్రమానికి రెడీ అయ్యారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ఆసరాగా నిలుస్తోంది.
ఇప్పటికే.. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశారు. గత సంవత్సరం అర్హులైన నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోలేదన్న ఆందోళన కనిపించింది. అందుకే ఈసారి వారిని కూడా జాబితాలో చేర్చారు. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ జరిగి నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.
ఏదేమైనా కరోనా కాలంలోనూ ఇలా నేతన్నలకు సాయం చేయడం అంటే గొప్పగానే చెప్పాలి. చేనేత కార్మికులకు పాదయాత్రలోనే వైయస్ జగన్.. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నారు.