జనసేన ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ వ్యవహారం మొదటి నుంచి ఆ పార్టీకి తలనొప్పిగా ఉంటూ వస్తోంది. ఆయన జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక గెలిచిన దగ్గర నుంచి పార్టీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తమకు రాజకీయ బద్ద శత్రువైన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు సన్నిహితంగా మెలుగుతూ సందర్భం వచ్చినప్పుడల్లా, ఆయన ను పొగుడుతూ వస్తున్నారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్న రాపాక ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ, పవన్ ఫ్యాన్స్ తో పాటు, జనసేన కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆయన విషయంలో జనసేన ఎందుకో వెనక్కి తగ్గుతూ వస్తోంది.
కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రాపాక కు వ్యతిరేకంగా పోస్టింగ్ పెడుతూ, తమ అక్కసును తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆయన వైసిపి అభ్యర్థులకు ఓటు వేసారు. ఈ విషయంలో జనసేన అధిష్టానం కూడా రాపాకకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఆయన స్వతంత్రంగానే వ్యవహరించారు. ఒకవేళ జనసేన అధిష్టానం టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని సూచించినా, వైసిపి వైపు మొగ్గు చూపిస్తూ ఉండేవారు. ఇది ఎలా ఉంటే తమకు రాజకీయ శత్రువైన వైసీపీకి ఓటు వేయడం పై పవన్ ఫ్యాన్స్ రాపాకను టార్గెట్ చేసుకున్నారు.
ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే జనసేన నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా, పవన్ ఫ్యాన్స్ మాత్రం రాపాక పై తమ ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తూ, ఆయన పార్టీ సస్పెండ్ చేసింది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు.