తెలంగాణలో ఆదివారం నమోదైన కేసులు 730...కేవలం 3297 పరీక్షలకే ఇన్ని కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో ఇదే అత్యధిక పాజిటివ్ కేసుల శాతం...ఇతర రాష్ట్రాలు పరీక్షలు అధికం చేసి కేసుల నియంత్రణలో, వైద్య సదుపాయాలు మెరుగు పరచడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తుంటే, మన రాష్ట్రానికి మాత్రం ఇంకా పరీక్షలు ఎలా తగ్గించాలా, ప్రజలను ఎలా మభ్యపెట్టాలా అనే ఆలోచన చేయడం సిగ్గు చేటని ప్రభుత్వాన్ని జనాలు తిట్టి పోస్తున్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా ఇప్పుడు పెరుగుతోందనే చెప్పాలి. పక్క రాష్ట్రం ఏపీని చూసి అయినా నేర్చుకోవాలని హితవులు పలుకుతున్నారు. ఏపీలో ఆదివారం ఒక్కరోజులో 24451 పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిన కేసులు కేవలం 477. ఏపీ స్థాయిలో మన దగ్గర పరీక్షలు చేస్తే 5000 కు పైగా కేసులు వచ్చే అవకాశం ఉందన్న వాదన బలంగా కొంతమంది వినిపిస్తున్నారు.
అసలు కరోనా వస్తే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం అందించే సదుపాయాలు ఏమిటి? అనే అవగాహన కల్పించే నాధుదే రాష్ట్రంలో కరువయ్యాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్నా ...చావులు తక్కువగా ఉన్నాయన్న ప్రభుత్వ వాదన శుద్ద అబద్దమని తేలిపోతోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అసలు శవాలకు పరీక్షలు చేస్తే కదా మరణం కరోనా వల్లనా... ఇతర కారణాల వల్లానా అని తెలిసేది... హైకోర్టు శవాలకు కరోనా పరీక్షలు చేయాలని సదుద్దేశంతో ఆదేశాలు ఇస్తే, సాంకేతిక కారణాలు చూపించి సుప్రీం కోర్టులో స్టే తెచ్చు కున్నారు... ఇంత కన్నా హేయమైన చర్య ఉంటుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మొన్నటి దాకా ఎవరికి కరోనా వచ్చినా గాంధీలోనే వైద్యం అని చెప్పిన పెద్దలు అడ్రెస్ లేకుండా పోయారు...పెద్దోళ్ళకు వస్తే అన్నీ సదుపాయాలు ఉన్నాయి...కార్పొరేట్ సేవలు వాళ్ళ కాళ్ళ వద్దకు వస్తున్నాయి... పేదలు, మధ్య తరగతి పరిస్తితి ఏంటి?మొన్నటికి మొన్న ఒక మహిళను ఎలా పొట్టన పెట్టుకున్నారో చూశాం... కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్క రోజుకు రెండు లక్షలు అవుతాయని చెబితే, సాధ్యం కాక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్యం దొరకక ఆ అభాగ్యురాలు ప్రాణాలోదలడం చూశాం...అనేక మంది పెషంట్లు, డాక్టర్లు గాంధీలో ప్రరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కళ్ళకు గట్టినట్టు వివరిస్తూ వీడియోలు పెట్టడం చూస్తున్నాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.