'104' వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 104' వాహనాల్లో కోవిడ్ శాంపిల్ సేకరణ సేకరించాలని తెలిపారు.షుగర్, బీపీ లాంటీ వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులివ్వాలని సూచించారు. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ జరగాలని అన్నారు. అవసరమనుకున్న వారిని పీహెచ్సీకి రిఫర్ చేయాలన్నారు. '104' సిబ్బందితో పాటు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రతినెలలో ఒక రోజు తప్పనిసరిగా ఒక గ్రామానికి '104' వాహనం వెళ్లాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేస్తున్న కోవిడ్ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం పేర్కొన్నారు. ''కంటైన్మెంట్ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, కొన్ని పరీక్షలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునేవారికి కేటాయించాలని సూచించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి వారికి సైతం కోవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే, ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలన్నారు.లోకల్ ప్రోటోకాల్ ను రూపొందించి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్వోపీని ఆ ఇంటికి తెలియజేయాలన్నారు. 'రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ప్రతి పీహెచ్సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ ఉండాలని అన్నారు.
కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్ పెట్టి అందులో వివరాలు ఉంచాలి. అందులో ఫోన్ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేయాలి. అర్బన్ ప్రాంతాల జనాభా ప్రాతిపదికన, అవసరమైన ప్రాంతాల్లో అర్బన్ హెల్త్సెంటర్ ఏర్పాటు చేయాలని'' సీఎం పేర్కొన్నారు. అలాగే వర్షా కాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయని, సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శానిటేషన్పైన కూడా దృష్టి పెట్టి, ప్రజలకు అవగాహన కలిగించేలా హోర్డింగ్స్ పెట్టాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కిందకు కోవిడ్ను తొలిసారిగా తీసుకువచ్చింది మనమేనని తెలిపారు.