లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన ప్రముఖ హాస్యనటి విద్యుల్లేఖ రామన్.. అకస్మాత్తుగా నెట్టింట్లో దర్శనమిచ్చి అందరినీ షాక్​కు గురిచేసింది. భారీగా కసరత్తులు చేసి ఫిట్​గా తయారైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

 

 

లాక్​డౌన్​లో ఇంటికే పరిమితమైన చాలామంది తమ శరీర బరువు పెరిగిపోతుంది అని అంటున్న మాటలు మన చెవిన పడుతూనే ఉన్నాయి. అయితే ప్రముఖ హాస్యనటి విద్యుల్లేఖ రామన్‌ మాత్రం ఇందుకు భిన్నం. తాజాగా ఆమె పోస్ట్​ చేసిన ఫొటోనే ఇందుకు నిదర్శనం. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 

 

ఇటీవల తన బరువు విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని, అవెంతో బాధించాయని ఆమె ఆవేదన చెందారు. అయితే తాజాగా ఈ లాక్​డౌన్​ సమయాన్ని వినియోగించుకుని విమర్శలు చేసినవారికి తగిన సమాధానం చెప్పాలని భావించారు. అంకితభావంతో కసరత్తులు చేసి బరువు తగ్గారు. తన శరీరాకృతిని ఫిట్​గా మార్చుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె శరీరంలో మార్పు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అయ్యింది.

 

 

ఫేక్‌ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను అధిక బరువు ఉన్నప్పుడు 'నువ్వు ఎలా ఇంత ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నావు?' అని నన్ను చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు నిజంగా నాలో విశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. నేను సాధించలేను అనుకున్నది.. సాధించా. నా లైఫ్‌స్టైల్‌ను, అలవాట్లను మార్చుకున్నా. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకున్నా.. ఇది నిజం.

 

 

జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. వారంలో ఆరు రోజులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎటువంటి రహస్యాలు, మందులు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన శ్రమ చాలు.. మన కన్నీరు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 2020 జూన్‌ 20 నాటికి నా బరువు 68.2 కిలోలు.." అని విద్యుల్లేఖ భావోద్వేగంతో వివరించారు.

 

 

'రన్‌ రాజా రన్‌', 'రాజుగారి గది', 'సరైనోడు', 'ధృవ', 'దువ్వాడ జగన్నాథమ్‌', 'నిన్నుకోరి', 'ఆనందో బ్రహ్మ', 'భాగమతి'.. ఇలా అనేక చిత్రాల్లో కనిపించి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల 'వెంకీమామ', 'మత్తువదలరా' సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు విద్యుల్లేఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: