అప్పుడే ఏడాది కావస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిర్మించిన ప్రతిష్టాత్మక కట్టడాన్ని పక్కన పెట్టేయడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఉన్నపళంగా కూల్చివేసి. తెలుగుదేశం శ్రేణుల అహం దెబ్బతినేలా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకొని. ఇదంతా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేత. ఈ కూల్చివేతకు గురువారం నాటికి ఏడాది పూర్తి కావస్తోంది.
రాజధాని పరిధిలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ఖాయమని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ క్రమంలో కరకట్టలోని అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చి వేశారు. ఈ చర్యపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పట్లో జగన్ నిర్ణయం సంచలనంగా మారింది. ఆసక్తికరంగా, ఈ కూల్చివేతకు సంవత్సర కాలం గడిచినా… అక్కడి స్క్రాప్ను మాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. కాగా, ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏడాది గడచిన సందర్భంగా గురువారం ప్రజావేదిక ప్రదేశాన్ని మరోసారి పరిశీలించనున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏంటో?!
మరోవైపు, ‘ప్రజా వేదిక’ కూల్చివేత వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోలేకపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇటీవల ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’ అంటూ ఏకంగా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో ప్రజావేదిక ఫోటోను కూడా కవర్ పేజీ బ్యాక్గ్రౌండ్లో వాడారు. సిమెంటు ధరలు, ఇసుక కొరత, విద్యుత్ ఛార్జీల షాక్.. ఇలాంటి వ్యవహారాలన్నిటినీ ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’ పుస్తకంలో టీడీపీ ప్రస్తావించింది. టీడీపీ హయాంలో తెరపైకొచ్చిన అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతిని వైఎస్ జగన్ సర్కార్ రద్దు చేయడంపైనా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పుస్తకం ద్వారా. ‘నవ రద్దులు – ‘జె’గన్’ అంటూ వైఎస్ జగన్పై దుమ్మెత్తిపోసిన టీడీపీ, ‘నవ మోసాలు’ అంటూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది.