మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పట్లాగే, అధికార- ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవడం కాకుండా ఈ దఫా రూట్ మార్చాయి. ముఖ్యమైన అంశం విషయంలో మాత్రం ఒకే మాటపై నిలిచారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 5 లో సడలింపులు ఇచ్చిన తరువాత ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుమీదకు వస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పోలీసులు, ప్రభుత్వం చెప్తూనే ఉంది. ప్రభుత్వాలు చెప్తున్నా ప్రజలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఇలా కరోనా కలకలం కొనసాగుతుండటంతో ప్రజలకు మేలు చేసే విషయంలో మాత్రం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కఠినంగా హెచ్చరించారు. ఇద్దరూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటం, నగరంలోని ఐదు ప్రాంతాల్లో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు ఇటీవల ప్రకటించింది. అయిపనప్పటికీ పెద్దగా మార్పు లేని నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదంటే మరోసారి లాక్ డౌన్ విధించమంటారా అని యడియూరప్ప బెంగళూరు వాసులను మరోమారు హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు బాధ్యతగా ఉండాలని ఆయన కోరారు. తిరిగి లాక్ డౌన్ విధించకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే రీతిలో స్పందించారు. కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ, కేవలం ఐదు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని బెంగుళూరు మొత్తం 20 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయకపోతే బెంగుళూరు మరో బ్రెజిల్ అవుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు రూ.5వేలు ఇవ్వాలని కుమారస్వామి కర్ణాటక సర్కారును డిమాండ్ చేసారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ సరిపోదని కార్మికులను వెంటనే ఆదుకోవాలని కోరారు. కాగా, ప్రజలకు సీఎం వార్నింగ్ ఇవ్వడం, ప్రతిపక్ష నేత సైతం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు పాటిస్తారా? అనే సందేహం సహజంగానే తెరమీదకు వస్తోంది.