తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వల్ల అమలు చేసిన లాక్ డౌన్ ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దాంతో నగర ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నగరంలోని కొన్ని ముఖ్యప్రాంతాలను మూసివేయాలని ఆ ప్రాంత అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో నగరంలోని పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లో ఎప్పుడు కొనుగోలుదారులతో సందడిసందడిగా ఉండే సికింద్రాబాద్ జనరల్ బజార్ను, ఆ పక్కనే ఉండే సూర్యా టవర్స్ ను, మరియు ప్యారడైజ్ సర్కిల్ మూసివేయాలని నిర్ణయించారు. ఈ మూసివేత వచ్చే నెల (జూలై) 5 వరకు అమలులో ఉంటుందని అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కరోనా జాగ్రత్తల గురించి వినిపిస్తున్నారు, వివరిస్తున్నారు. సిటీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, ఆటో స్టాండ్స్, కూరగాయల మార్కెట్ల వద్ద మైకులతో జాగ్రత్తలు చెప్తున్నారు. 2 నిమిషాలపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఆడియో మెసేజ్ వినిపిస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే 60 జంక్షన్లలో ప్రతి చోటా 4 మైక్ లు ఏర్పాటు చేసి.. ఫేస్ మాస్క్లు, ఫిజికల్ డిస్టెన్సింగ్, హైజెనిక్ ఫుడ్, కరోనా సింప్టమ్స్ తదితర అంశాలపై అవేర్నెస్ కల్పిస్తున్నారు.
ఇదిలాఉండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆందోళనకర స్థాయిలో కేసులు బయట పడడానికి తొలి దశలో ట్రేసింగ్, టెస్టింగ్ విషయంలో చేసిన నిర్లక్ష్యమే కారణమని డాక్టర్లు , ఎక్స్ పర్టులు చెప్తున్నారు. నిజానికి తొలిదశలో అధికారులు గట్టిగా పనిచేశారు. పాజిటివ్ కేసులొచ్చిన ఏరియాలను కంటెయిన్మెంట్ చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా ఎవరెక్కడ తిరిగారో ఆరా తీశా రు. జీహెచ్ఎంసీ సిబ్బంది కంటెయిన్ మెంట్లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో రోజూ డిసిన్ఫెక్షన్ స్ప్రే చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సర్కారు టెస్టులు చేయడం ఆపేసింది. ట్రేసింగ్లో సీరియస్ నెస్ తగ్గింది. లాక్ డౌన్ ముగిశాక అయితే పూర్తిగా వదిలేశారు. ప్రైమరీ కాంటాక్టులనూ పట్టించుకోలేదు. దుకాణాలు ఓపెన్ కావడంతో జనం తిరగడం మొదలైంది. వైరస్ మరింతగా వ్యాపించింది.