ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 500కు పైగా కేసులు రాగా.. ఈ రోజు పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 600 దాటింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 11,489కు పెరిగింది. గడిచిన 24గంటల్లో ఏపీలో 10 మంది కరోనాతో మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 605 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 570 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 11,489 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవారి కేసులు 9,353 ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా నిర్థారణ అయింది. ఏపీలో గత 24 గంటల్లో 22,305 మంది నమూనాలను పరీక్షించారు.
కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 146కి పెరిగింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,196కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6,147 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 7,91,624 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో కడప జిల్లాలో అత్యధికంగా 133 కేసులు వచ్చాయి. ఆ తర్వాత అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 79 కేసులు, గుంటూరు జిల్లాలో 74 కేసులు వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1615 కేసులు ఉండగా.. కృష్ణా జిల్లాల్లో 1199, అనంతపురం జిల్లాలో 1159, గుంటూరు జిల్లాలో 1032 కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 764 యాక్టివ్ కేసులు ఉన్నాయి.