మన సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆక్రమణల పర్వం గురించి ప్రత్యేకంగా తెలియజేయనక్కర్లేదు. లఢఖ్లోని గల్వాన్ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ చర్యలతో మనం మన జవానులను కోల్పోయాం. అయితే, దీనిపై చైనా తన వివాదాస్పద వైఖరిని కొనసాగిస్తోంది. భారత్పై దుమ్మెత్తి పోస్తోంది. కానీ ఆ దేశంలో మాత్రం, చైనా తీరును ఛీ కొడుతున్నారు. ఇదేం పాడు బుద్ధి అని విమర్శిస్తున్నారు.
చైనాలో నియంతృత్వ కమ్యూనిస్టు పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే అక్కడి అభిప్రాయాలు పెద్గా ప్రజల్లోకి రావు. చైనాలో అక్కడి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు, చర్చలు కొనసాగుతున్నా...ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లో మాత్రం గల్వాన్లో చైనా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైందట.
ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అదృశ్య శక్తి ఒకటి వాటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు భావిస్తున్నారు. వారే కాకుండా హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు వినిపిస్తున్నాయి. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఆ సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా గల్వాన్లో ఆ దేశం వ్యవహరించిన తీరు సరికాదని విమర్శిస్తుడటం కొసమెరుపు. గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణ ప్రయత్నించడం ద్వారా పొరుగు దేశం చైనా ఏం లాభపడిందో తెలియదుగానీ సొంత ప్రజల నుంచి మాత్రం చీ కొట్టించుకుంటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.