పీవీ నర్సింహారావు..ఈ పేరు వింటే చాలు తెలుగువారికి గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. చాలా తక్కువ మెజార్టీతో ప్రభుత్వం ఉన్నా... ప్రభుత్వం కూలిపోకుండా ఐదేళ్ల పాటు పాలన గొప్ప పాలన సాగించిన గొప్ప రాజనీతిజ్ఞుడు. పీవీ ప్రధానిగా కొనసాగింది ఐదేళ్లే అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భావి భారత ఆర్థిక నిర్మాణానికి పీవీ వేసిన పాదులపైనే నేడు నిర్మాణాలు కొనసాగుతున్నాయనడంలో అతిశేయోక్తి లేదు. గొప్ప ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పీవీ హయాంలోనే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.
భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాదివాసి. ఒకేఒక్క తెలుగువాడు కావడం గమనార్హం. పీవీగా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త. దేశంలోని 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే పండితుడు. మంచి రచయిత కూడా. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్ సభ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఇలా అనేక రాజకీయ పదవుల్లో కొనసాగడం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని రాజనీతిజ్ఞతకు నిదర్శనమనే చెప్పాలి.
పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయన జూన్ 28, 1921లో జన్మించారు. డిసెంబర్ 23, 2004లో పరమపదించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం చేస్తేనే ఉండేవాడు. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకోవడం గమనార్హం. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయం.
పీవీ నిర్వహించిన పదవులు
1951 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యత్వం
1957-77 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
1962-64 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1964-67 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
1967 ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
1968-71 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1971-73 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1977 లోక్సభ సభ్యత్వం
1980 లోక్సభ సభ్యత్వం
జనవరి 1980-జూలై 1984 కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
జూలై 1984-డిసెంబర్ 1984 కేంద్ర హోం శాఖమంత్రి
1984 లోక్సభ సభ్యత్వం (మూడో సారి)
నవంబరు 1984-ఫిబ్రవరి 1985 భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జనవరి 1985-సెప్టెంబరు 1985 కేంద్ర రక్షణ శాఖమంత్రి
సెప్టెంబరు 1985-జూన్, 1988 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
జూలై 1986- ఫిబ్రవరి 1988 కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
జూన్ 1988-డిసెంబర్ 1989 విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
1989 లోక్సభ సభ్యత్వం (నాలుగోసారి)
1991 మే 29 - 1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
జూన్ 1991 – 1996 మే 10 ప్రధానమంత్రి
నవంబరు 1991 ఉప ఎన్నికలలో నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి ఐదవసారి లోక్సభకు ఎన్నికయ్యాడు.