కరోనా చికిత్స కోసం అనేక కొత్త రకాల మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సీన్ ఇప్పట్లో రాదని తెలియడంతో.. చికిత్స కోసం మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ వ్యాధి రాకుండా పూర్తిగా రక్షించుకోలేకపోయినా.. కనీసం మందులతో దాని తీవ్రత తగ్గించేందుకు కృషి జరుగుతోంది.
ఈ వ్యాధి గురించి తెలిసిన మొదట్లో హైడ్రీక్సీక్లోరీన్ ను ఎక్కువగా సిఫారసు చేసేవారు. ఇండియా ఈ మాత్రలను భారీగా అమెరికా వంటి దేశాలకు ఎగుమతి కూడా చేసింది. అయితే అదంత సేఫ్టీ కాదని కొన్ని రిపోర్టులు కూడా వచ్చాయి. దీంతో ఆ మందు క్రేజ్ తగ్గింది.
ఇప్పుడు ఎక్కువగా డెక్సామెథాసోన్ పేరు వినిపిస్తోంది. ఇది ఓ స్టెరాయిడ్ ఔషధం. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలున్న కరోనా బాధితులు దీన్ని వాడవచ్చని వార్తలు కొన్నిరోజులుగా షికారు కొడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా కొవిడ్-19 బాధితులకు ఈ మందు వాడేందుకు అనుమతించింది.
కరోనా బాధితుల కోసం ఇతర ఉపశమన చర్యలతో పాటు ఈ మందును కూడా బాధితులకు ఇవ్వవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఔషధానికి ప్రత్యామ్నాయంగా చౌకైన డెక్సామెథాసోన్ను ఉపయోగించొచ్చని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.