దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢ నమ్మకాలు నమ్ముతూనే ఉన్నారు.  చేతబడి..బానామతి.. ఇతర క్షుద్రపూజలు అంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.  తమ శత్రువులను చేత బడి చేయించి చంపుతారని.. దానికోసం రాత్రి పూట స్మశానాల్లో క్షుద్రపూజలు చేస్తుంటారని అంటుంటారు.  ఒడిశాలో ఘోరం వెలుగు చూసింది.  చేతబడి చేస్తున్నారన్న నెపంతో శనివారం  రాత్రి భార్యాభర్తలను గ్రామస్తులు గొడ్డలితో నరికి చంపారు. కలకలం రేపుతున్న ఈ ఘటన మల్కన్‌గిరి సమితిలోని పెండ్రాల్‌గూడ గ్రామంలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా పెండ్రాల్ గూడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో మృతిచెందుతున్నారు.  ఆ చిన్నారులంతా ఎవరో చేతబడి చేసి తమ పిల్లలను చంపేస్తున్నారని గ్రమాస్తులు భావించారు. ఆ గ్రామంలోని భార్యాభర్తలు సోమ మాఢి(50), శుక్ర మాఢి(45)లే చేతబడి చేసి పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నారని కొంతమంది నిర్ధారించుకున్నారు.   

 

తమ గ్రామంలో ఈ ఫ్యామిలీ క్షుద్రపూజలు చేసి మరణాలకు కారణం అవుతున్నారని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు వీరిని ఎలాగైనా అంతమొందించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.  ముక్కపచ్చలారని చిన్నారులను పొట్టన బెట్టుకుంటున్న వాళ్లను చంపేయాలని అనుకున్నారు. పిల్లలను బలి తీసుకుంటున్న వారిని ఎలాగైనా చంపేయాలని గ్రామానికి చెందిన ముక్కా మడకామి, లక్ష్మా మడకామి నిర్ణయించుకున్నారు. 

 

రాత్రి సమయంలో సోమ మాఢి, శుక్ర మాఢి నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడి చేశారు. ఊహించని పరిణామానికి వారు తేరుకునేలోపే గొడ్డలి పోట్లు వారిపై విచక్షణా రహితంగా పడ్డాయి.   పదునైన ఆయుధాలు వారి ఒంటిమీద పడటంతో రక్తపు మడుగులో కొట్టుకొని చనిపోయారు.  కాగా, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.   ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: