దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  గత 24 గంటలలో దేశంలో కొత్త‌గా 19,906 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 410 మంది మృతిచెందారు.  దేశంలో ప్ర‌స్తుతం కరోనా రోగుల సంఖ్య 5,28,859కు చేరుకుంది. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు 16,095 మంది మృతిచెందారు. చికిత్స అనంత‌రం 3,09,713 మంది కోలుకున్నారు. రాజధానిలో కరోనా రోగుల సంఖ్య 80 వేల 188కు పెరిగింది. ఇక్క‌డ‌ మొత్తం మృతుల‌ సంఖ్య 2,558కి చేరుకుంది.  ప్రతిరోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400కు పైగా జనం మరణిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంతో పోలిస్తే భారతదేశం కరోనతో మెరుగ్గా పోరాడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు.  భారత్‌లో కరోనా మొదటి కేసు జనవరి 30న వచ్చిందని,  దేశ జనాభా 130 కోట్లు కాగా, ప్రస్తుతం 5 లక్షల కేసులున్నాయని అందులో 3.10లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో కేవలం 3 శాతం మాత్రమే మరణ రేటు ఉందని, ఇది అత్యంత తక్కువన్నారు. మనకంటే బ్రెజిల్‌, యూకే, యూఎస్‌లో మరణాల రేటు ఎక్కువగా ఉందన్నారు.  వచ్చే  ఏడాది నాటికి కరోనాకు టీకా కూడా వస్తుందన్నారు.

 

కరోనా కూడా ఇతర వ్యాధుల మాదిరిదేనని, కానీ మన జీవనశైలిని మార్చుకోవాల్సి వస్తుందని ఆయన సూచించారు.  గత 5 నెలల క్రితం ఒక్క ప్రయోగశాల ఉంటే ఉప్పుడు 1036 ప్రయోగశాలల్లో లక్షల్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. మనం మెరుగైన స్థితిలో ఉన్నామని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి ఎంత కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచమంతా కృషి చేస్తోందని, భారతదేశంలో కూడా దీనిపై పరిశోధన జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: