ఇప్పుడంతా కరోనా కలకలమే. ఏ అంశమైనా దానితో ముడిపడే ఉంటోంది. ఇందులో కొన్ని చిత్రాలు సైతం తెరమీదకు వస్తున్నాయి. ప్రజలు బయటకు వస్తున్నా వారికి లోపల భయం దాగుంటుంది. తప్పని పరిస్థితి అయితే తప్పా ఎవరూ బయటకు రావడం లేదు. అయినా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ మనుషులకే కాదు జంతువులకూ సోకుతోందనే వార్తలు ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి. తాజాగా ఓ షాకింగ్ వార్త తెరమీదకు వస్తోంది. 50 మేకలు, గొర్రెలను పశుసంవర్థకశాఖ అధికారులు క్వారంటైన్కు తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గోడేకేరి గ్రామంలో చోటుచేసుకుంది. ఎందుకు అంటే, గొర్రెల కాపరికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది.
గ్రామంలోని మేకలు, గొర్రెలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు గమనించారు. గ్రామంలో గొర్రెల కాపరి కోవిడ్-19 భారిన పడ్డాడని గుర్తించారు. విషయాన్ని తుమకూరు జిల్లా ఇన్ఛార్జీ, న్యాయశాఖ మంత్రి జే సీ మధుస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా పశుసంవర్థకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకుని గొర్రెలు, మేకల నుంచి శాంపిల్స్ను సేకరించారు. మేక ప్లేగు వ్యాధి(జ్వరం, నోటిలో పుండ్లు, విరేచనాలు, న్యూమోనియా, కొన్నిసార్లు మరణం సంభవించడం)తో గొర్రెలు, మేకలు బాధపడుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శాంపిల్స్ను సేకరించి భోపాల్లోని పరిశోధనశాలకు పంపినట్లు తెలిపారు.
అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం కరోనా సోకలేదని తెలుస్తోంది. అయినప్పటికి సదరు మేకలు, గొర్రెలను క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. ఎందుకంటే మేక ప్లేగు వ్యాధి సైతం అంటువ్యాధే. ఇతర జంతువులకు సోకకుండా ఉండేందుకు వీటిని క్వారంటైన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మేకల క్వారంటైన్ కథాకమామిషు ఇదండి.
ఇదిలాఉండగా, మేకలే జీవనాధారంగా బతికే ఖమ్మం జిల్లాకు పశువుల కాపరి కోటయ్య మనుషులం మనమే జాగ్రత్త తీసుకోలేకుంటే ఈ మూగజీవాల పరిస్థతేంటి అనుకున్నాడో ఏమో. మేకల యజమానిగా వాటి బాధ్యత తానే తీసుకున్నాడు. మనుషులు ఉపయోగించే మాస్కులు మాదిరిగానే ప్రత్యేకంగా తయారు చేయించి 50 మేకలకు మాస్కులు తొడిగి మేపడానికి తీసుకెళ్లాడు. ఇటీవల ఆ వార్త వైరల్ అయింది.