ఎన్నికలు జరిగి గట్టిగా ఏడాది అయింది. ఏపీలో కొత్త సర్కార్ గా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక రెండవ ఏడాది మొదలైంది. కానీ ఏపీలో రాజకీయాలను చూసినా ఎన్నికల వేడిని చూసినా కూడా రేపో మాపో ఎన్నికలు ఖాయమన్న సీన్ కనిపిస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని ఆయన గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే టీడీపీ అంటోంది.
ఇక మిగిలిన విపక్షాలు కూడా ఇసుక నుంచి ఇంగ్లీష్ మీడియం వరకూ అన్ని రకాల అంశాలను ఆయుధాలుగా చేసుకుని జగన్ మీద పోరు చేస్తూనే ఉన్నాయి.అయితే ఎవరి సత్తా ఏంటి అన్నది తేలాలంటే ఏదో ఒక ఎన్నిక జరగాలి. కానీ చూసుకుంటే స్థానిక ఎన్నికల కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అవి ఎపుడు జరుగుతాయో ఎవరికి తెలియదు.
కానీ దాని కంటే ముందు మరో కీలక ఎన్నిక ఏపీలో తోసుకువచ్చేలా కనిపిస్తోంది. అదే నర్సాపురం ఉప ఎన్నిక. నర్సాపురం నుంచి గెలిచిన రఘురామక్రిష్ణంరాజు జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కార్ని ఆయన విపక్షం కంటే ఎక్కువగా తూర్పరా పడుతున్నారు. ఆయన బీజేపీకి దగ్గర కావాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వేరు పడినా ఎంపీ సీటు ఉంటుంది. దాంతో ఆయన మీద వేటు వేసి అయినా కుర్చీ నుంచి దించేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉందిట.
ఈ క్రమంలో చూసుకుంటే అనర్హత పిటిషన్ని నేరుగా లోక్ సభ స్పీకర్ కి ఇవ్వడం ద్వారా ఎంపీ రాజుగారిని దించేయాలని వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. అదే కనుక జరిగితే ఎంపీ సీటుని రాజు గారు కోల్పోయి ఎన్నిక అనివార్యం అవుతుంది. అపుడు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. నర్సాపురంలో ఉప ఎన్నికలు జరిగితే విపక్షంలో ఉన్న బీజేపీకి, జనసేనకు, టీడీపీకి ఒక ఆయుధం దొరికినట్లే. జగన్ పాలన బాగాలేదు అని ప్రచారం చేస్తున్న ఈ పార్టీలు కలసి కట్టుగా జగన్ని ఓడించేందుకు పనిచేస్తాయేమో చూడాలి.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే బీజేపీ తరఫున రాజుగారు పోటీ చేస్తారట. ఆయనకు జనసేన మద్దతు ఎటూ ఉంటుంది, ఇక టీడీపీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అపుడే దీని మీద న్యూస్ వైరల్ అవుతోంది. అదే జరిగితే వైసీపీ మీద మూకుమ్మడి పోరాటమే. మరి ఉప ఎన్నిక మినీ భారత యుధ్ధమే. కధ అంతవరకూ తేవాలని వైసీపీ అనుకుంటోంది మరి.