ఏపీలో ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని పదే పదే చెప్పే జగన్ దానిని ఎంత మాత్రం పాటించడం లేదని ఆరోపించారు. వైసీపీ లో ఎంత మాత్రం సామాజిక న్యాయం లేదని... మూడు ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారని.. వైసీపీలో వేరే కులాల వారు లేరా ? వారు పదవులకు పనికి రారా ? అని రామకృష్ణ జగన్ను ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పాలక మండల్లలోనూ మీ బంధువులే ఉన్నారని... మొత్తం 70 మందిలో 46 మంది మీ కులం వారే ఉన్నారు. సెర్చ్ కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లకే ఇచ్చారు. ముగ్గురు, నలుగురే మొత్తం నడిపిస్తున్నారని రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే జగన్ కేబినెట్లో ఉన్న మంత్రులకు సీఎంను కలిసే పరిస్థితి ఉందా ? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎస్సీ నాయకులు పదవులకు పనికి రారా ? అని ప్రశ్నించిన ఆయన ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబటి రాంబాబు, పార్థసారథి వంటి వారు పదవులకు పనికిరారా?, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఉందా ? అని ప్రశ్నించారు.
ఇక కమ్యూనిస్టులకు కులం అంటగడుతోన్న వైసీపీ నేతలు ముందు మీ పార్టీలో ఏ కులానికి ఎక్కువ పదవులు ఇచ్చారో చూడాలని.. సీఎం జగన్ వీటన్నింటికి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి జేఏసి నిర్ణయాలకు సిపిఐ సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. దశాబ్దాలుగా దళితులు అనుభవిస్తున్న భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు.