మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో ఇరుక్కుని అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా ఆయన్ను మొన్నటి వరకూ గుంటూరు జీజీహెచ్ లో ఉంచారు. ఇప్పుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి జైలుకు తరలించారు. అయితే.. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలంటూ టీడీపీ గొడవ చేస్తోంది.
ఈ విషయంలో అచ్చెన్నాయుడిని జైలుకు తరలించిన రోజు రాత్రే ఆయన అన్నకుమారుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు జైలు దగ్గర హడావిడి చేశారు. అయితే ఇదంతా డ్రామా అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. అంతే కాదు.. అచ్చెన్నాయుడు చేసిన అరాచకాలు మొత్తం రామ్మోహన్ నాయుడికి తెలుసని అప్పల రాజు అంటున్నారు.
అచ్చెన్నాయుడు గురించి రచ్చ రచ్చ చేస్తున్న తెలుగు దేశం నేతలు.. ఎందుకు ఈఎస్ఐ స్కాంకి సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. బాబాయ్ అచ్చెన్నాయుడి అక్రమాలు ఎంపి.రామ్మాహన్కి కూడా తెలుసని చెప్పారు. 35 లక్షలమంది కార్మిక కుటుంబాల డబ్బును అక్రమంగా తరలించారని అప్పలరాజు మండిపడ్డారు.
టీడీపీ నేతల అక్రమాలు, అవినీతి ఎవరూ అడగకూడదన్నట్లు లోకేష్ మాట్లాడటం హస్యాస్పదం అని అప్పలరాజు అన్నారు. అసలు అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్టమొదటిసారి స్పందించింది సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు తెలిపారు. వైద్య బృందం నివేదిక ప్రకారమే అచ్చెన్నాయుడుని జైలుకి తరలించారని అప్పలరాజు అంటున్నారు.